నెల్లూరు జిల్లాలో వైసీపీకీ బిగ్ షాక్ తగలబోతోందా…? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి శరాఘాతంగా మారుతున్నాయా…? మొదటినుంచి పార్టీనే నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలు పార్టీకి దూరం అవుతున్నారా…? చూస్తుంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. వైసీపీలోకి వలసలవల్ల మొదటికే మోసం వస్తోంది. వలసల వల్ల పార్టీలో లుకలుకలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు నేతలు.
తాజాగా ఎన్నికల సమయంలో నెల్లూరు జిల్లాలో వైసీపీకీ బిగ్ షాక్ తగలనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరే విధంగా ఉన్నాయి. మేకపాటి కుటుంబం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి తాను పోటీ చేసేది లేదని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మేకపాటి స్వయంగా చెప్పినట్లు కూడా జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు ప్రధాన కారనం జగన్ స్వయంకృతాపరాధమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు మేకపాటి కుంటుంబం దూరంగా ఉంటున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకీ మొదటినుంచి ఆర్థికంగా, రాజకీయంగా వెన్నుదన్నుగా మేకపాటి కుంటుంబం ఉంది. ప్రత్యేక హోదాకోసం ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. అయినాసరే పార్టీలో ఆయనకి సరైన ప్రాధాన్యత దక్కలేదనే చర్చ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాంటి మేకపాటికి వైకాపాలో ఈ మధ్య తరచూ అవమానాలు ఎదురౌతున్న పరిస్థితి ఉందట.
ఈసారి ఎన్నికల్లో మేకపాటి కుటుంబం నుంచి ఒక్కరు కూడా గెలవరనే అంశం జగన్ చేసిన సర్వేలో తేలిందని అందుకే జగన్ లీకులు ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు వైసీపీలో అనం కుటుంబం చేరడం కూడా కారణంగా తెలుస్తోంది. ఆనం రాకతో పార్టీలో అసంతృప్తి తేట తెల్లమయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆనం, మేకపాటి కుటుంబాల మధ్య టికెట్ల వ్యవహారం కూడా మేకపాటి అసంతృప్తికి ప్రధాన కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు చెక్ పడాలంటే మేకపాటి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మేకపాటి స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.