అది 2014 ఎన్నికల సమయం.. అటు తెలుగుదేశం.. ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు హోరాహోరిగా ప్రచారం చేస్తున్న సమయం. ఇరు పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏం చేసేది ప్రజలకు వివరిస్తున్నారు. కానీ తన అనుభవంతో వైఎస్ఆర్సీపీకంటే ఓ అడుగు ముందే ఉన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసి మనకు అన్యాయం చేసిందంటూ మోదీ పక్కన కూర్చొని ప్రసంగాలు చేశారు. మీరు వైఎస్ఆర్సీపీ ఓటుకు వేస్తే కాంగ్రెస్కు ఓటు వేసినట్టే అంటూ ప్రచారానికి దిగారు. పిల్ల కాంగ్రెస్కు ఓటు వేస్తే.. తల్లి కాంగ్రెస్కు ఓటు వేసినట్టే అని ప్రచారంలో హోరెత్తించారు. దాన్ని ఆయన అనుకూల మీడియా కూడా విపరీతంగా ప్రచారం చేసింది.
సీన్ కట్ చేస్తే.. నాలుగున్నరేళ్ల తర్వాత సీన్ రివర్సైంది. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పంచన చేరారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పక్కన మోదీని విమర్శిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు చంద్రబాబు. అక్కడితో ఆగకుండా మళ్లీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్టే అంటూ టెలికాన్ఫరెన్స్ల్లో చెబుతున్నారు. ఇవన్ని చూస్తేంటే వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు చంద్రబాబులా ఉంది పరిస్థితి.
అయినా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇప్పటికే పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఎఅధికారంలోకి వచ్చాక ఎవరైతే హోదా ఫైల్పై సంతకం పెడతారో.. వారికే మద్దతిస్తామని కుండబద్దలు కొట్టారు. అది మోదీ అయినా, రాహుల్ అయినా, మరింకేవరైనా అన్నారు జగన్. మరి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మోదీకి ఓటేసినట్టు ఎలా అవుతుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
ప్రధాని మోదీ సభ నిర్వహించిన గ్రౌండ్లోనే రాహుల్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే పది సంవత్సరాల హోదా ఇస్తానన్న మోదీ మాట్లాడినట్లే.. రాహుల్ మాట్లాడారు. ఆయన పదవిలోకి రాగానే హోదాను మరిచినట్టు రాహుల్ మర్చిపోరని గ్యారంటీ ఏంటీ? ఆయన ప్యాకేజీ తీసుకో బాబు అనగానే ఓకే అన్నట్టు.. రేపు రాహుల్ అంటే చంద్రబాబు కాదనరని గ్యారంటీ ఏంటీ? ఇలా అనేక ప్రశ్నలు సామాన్యుడి మెదళ్లను తొలుస్తున్నాయి.