ఆళ్లగడ్డ నియోజక వర్గంలో టీడీపీలో వర్గ విబేధాలు పీక్ స్థాయికి చేరింది. గత కొన్ని నెలలుగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య అధిపత్యపోరుతో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య రాళ్లదాడి చేసుకొనేంత స్థాయికి వైరం చేరింది.
అఖిల, ఏవీ ఇద్దరిని అమరావతికి పిలిపించుకొని చంద్రబాబు సర్దిచెప్పినా ఇద్దరి మధ్య విబేధాలు మాత్రం సద్దుమనగలేదు. దీంతో టీడీపీ క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నారు. తాజాగా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి ఇద్దరిపై మరో బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లుకూడా దక్కవని చెప్పడం పార్టీలో కలకలం రేపుతోంది.
నియోజక వర్గంలో తమ సత్తా చాటేందుకు అఖిల, ఏవీ ఇద్దరూ పోటీ పోటీగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తుండగా…ఆదివారం సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. దాడి అఖిలప్రియే చేయించిందని సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను మంత్రి అఖిల ఖండించారు.
ఇద్దరి మధ్యున్న వర్గ విబేధాలతో పార్టీ నష్టపోతోందని ఆళ్ళగడ్డ నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రితో పాటు సుబ్బారెడ్డి పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టారని రాంపుల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. పరస్పరం గొడవలు పెట్టుకోవడం – పోటాపోటీ ర్యాలీలు దీక్షలు చేయడంతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని వాస్తవ పరిస్థితిని వెల్లడించారు. ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. అందుకే పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.