2019 ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చి వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అయితే.. పాలన పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు, అభివృద్ధి పనులన్నింటి విషయంలోనూ పునరాలోచన జరుగుతుంది. కొత్త పథకాలు తెరపైకి వస్తాయి. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రస్తుతం జరిగిన ఒప్పందాల వరకూ అన్ని ప్రణాళికలూ మారిపోతాయి. రాష్ట్ర రాజధాని విషయంలో మార్చే అవకాశం ఉండదు. కానీ.. అమరావతిని ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం చేసినంత భారీ ప్రణాళికతో నిర్మించే ఆలోచన మారుతుంది. కేవలం పరిపాలన కేంద్రంగా మాత్రమే అమరావతిని మార్చి.. దానికి తగ్గట్టుగానే నిర్మాణాలు చేపట్టేందుకు కొత్త ప్రణాళికలు తయారవుతాయి. పాలనా యంత్రాంగం మొత్తం.. మంత్రులు, అధికారులతో సహా కొత్తగా మళ్లీ రూపుదిద్దుకుంటుంది. దీనికి తగ్గట్టుగానే వారి ఆలోచనా విధానంలో పాలన సాగేందుకు వీలుగా.. అన్నింటినీ మార్చుకునేందుకు కొంత సమయం పడుతుంది.
జగన్ ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్లినా.. అక్కడ పదుల సంఖ్యలో సమస్యలను జనం ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. వాటన్నింటినీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకుందామంటూ జగన్ హామీలు ఇస్తూ వెళుతున్నారు. రాజధాని భూముల నుంచి మచిలీపట్నం పోర్టు వరకూ.. ప్రతి విషయంలోనూ జగన్ ఇప్పటికే హామీలు ఇచ్చారు. వీటన్నింటినీ జగన్ యంత్రంగాం నోట్ చేసుకుంటూ వెళుతోంది. జగన్ పీఠమెక్కిన తర్వాత.. ప్రధానంగా తాను గమనించిన, తన దృష్టికి వచ్చిన సమస్యలపైనే దృష్టి పెట్టి పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు అవకాశముంటుంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన అప్పటి పథకాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి.. జీవం పోసేందుకు ఆస్కారముంది.
చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేటు సంస్థల ఏర్పాటుకు కేటాయించిన భూముల విషయంలోనూ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి.. లోపాలను ఎత్తిచూపొచ్చు. రాష్ర్టంలో జరుగుతున్న పోలవరం సహా పలు ప్రాజెక్టుల్లో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపడం ద్వారా.. చంద్రబాబును ఇరకాటంలో పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుతం జగన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్లు తిన్నారనే లెక్కలనూ బయటపెడుతున్నారు. అధికారంలోనికి వస్తే.. ఈ లెక్కలను అంత తేలికగా వదలకపోవచ్చు.
ప్రస్తుతం చంద్రబాబు తన అధికార పరపతితో జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తన వైపు లాక్కుంటున్నారనే కోపం, ఆవేదన జగన్లో తీవ్రస్థాయిలో ఉన్నాయి. కానీ.. ఏం చేయలేని అసక్తతతో మిన్నకుండిపోయారు.
జగన్ పార్టీ అధికారంలోనికి వస్తే.. తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలకే మొదట గాలం వేస్తారు. ఎలాగూ చంద్రబాబు, పక్కనే ఉన్న కేసీఆర్ ప్రభుత్వాలు ఇదే చేసి.. దారి చూపించాయి కనుక జగన్ను ఎవరూ ఎత్తిచూపేందుకు అవకాశం ఉండదు. జగన్ ఆకర్షణ మంత్రం ఎంత తీవ్రంగా ఉండబోతోందంటే.. రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని క్లీన్స్వీప్ చేసేసి తెలంగాణలో మాదిరిగా నామరూపాల్లేకుండా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జగన్ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న చర్యలపై అంత కోపంతో ఉన్నారు.