మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ కి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రామ్ మాధవ్, సతీష్ జీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ నెల 25న ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. భాజాపా అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్న కన్నాకు నిరాశే మిగిలింది. దీంతో చివరకి బీజేపీకి గుడ్ బాయ్ చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తన పేరును చివరి వరకు పరిశీలించి.. ఆఖరి క్షణంలో వలస నేతగా పరిగణించి దూరంగా పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పైగా ఆ పదవిని ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించని వారికి (సోము వీర్రాజుకు) ఇస్తున్నారని తేలడంతో కన్నా కినుక వహించి రాజీనామా చేశారు. ఏపీకీ ప్రత్యేకహోదా, విభజన హామీలను భాజాపా విస్మరించడంతో పార్టీలో ఉంటూ తనకు భవిష్యత్తు ఉండదనే నిర్ణయం తీసున్నట్లు తెలుస్తోంది.
రెండ్రోజులపాటు తన అనుయాయులతో మంతనాలు జరిపి వారి మనోగతానికి అనుగుణంగా వైసీపీలో చేరాలని నిశ్చయించారు. ఇప్పటికే తనతో మంతనాలు సాగిస్తున్న వైసీపీ ముఖ్యులతో ఫోన్లో చర్చలు జరిపిన ఈ నెల 25న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.