త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న జగన్..అభ్యర్తుల విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సొంత బంధువులు అని చూడకుండా గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయిస్తున్నారు. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే టికెట్ లేదని జగన్ ఖరాకండీగా చెప్పారు. ఇప్పుడు తనకు నమ్మిన బంటుగా ఉన్న మరో ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు చేస్తున్న ఫోన్లకు ఆయన స్పందించడం లేదు. వైసీపీ అధినేత జగన్ తీరుతో మనస్తాపం చెందిన ఆర్కే, అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాడేపల్లి మండల వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యరనే వార్తలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న తమ ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
ఇదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెక్ పెట్టేందుకు పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నేతలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోని జగన్ నివాసంలో పలువురు టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.గుంటూరు జిల్లాకు చెందిన కౌన్సెలర్ ఉడుతా శ్రీను కూడా తన మద్దతుదారులతో కలిసి వైసీపీ లో చేరారు. అయితే జిల్లా టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకోనే ముందు కనీసం ఒక్కమాటైనాకూడా జగన్ చెప్పకపోవడంతోనే రామకృష్ణా రెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు సమాచారం. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు.