కర్నూలు జిల్లా రాజకీయాల్లో అభ్యర్ధుల పార్టీ మార్పులు ఇంకా కొనసాగుతున్నాయి. టికెట్ రాదనే భయంతోనే నేతలు పార్టీలు మారుతున్నారనేది గౌరు చరిత ఎపిసోడ్తో అర్థమవుతోంది. పాణ్యం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. జగన్ నేర్పిన పాఠాల ఎఫెక్టో ఏమో గానీ ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్పారు.
గౌరు చరిత పార్టీ మారడానికి ముఖ్య కారణం కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరు నెలల కిందట వైఎస్ఆర్సీపీలో చేరడమేనని తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి తమకు టికెట్ రాదనే అనుమానం గౌరు ఫ్యామిలీని వెంటాడుతోంది. ఇటు జగన్ కూడా ఇప్పటివరకూ టికెట్పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గౌరు ఫ్యామిలీ అనుమానంతో పార్టీని వీడి వెళ్లిపోయారు.
మరోవైపు శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటుకు గౌరు వెంకటరెడ్డిని పోటీ చేయమని పార్టీ నేతలు అడిగారట. కానీ ఆయన వెనకడుగు వేశారని టాక్.. నందికొట్కూరు టీడీపీ ఇంచార్జ్గా ఉన్న గౌరు వెంకటరెడ్డి బావ శివానందారెడ్డినే ఆయన పోటీ చేయకపోవడానికి కారణమని అప్పట్లోనే ప్రచారం జరిగింది. బావకు ఎమ్మెల్సీ సీటు వస్తుందనే అంచనాతో వెంకటరెడ్డి పోటీకి రెడీ కాలేదట. దీంతో చంద్రబాబు వేసిన పాచికలతో ఆ సీటు కేఈ ప్రభాకర్కు వెళ్లింది.
మరోవైపు శివానందారెడ్డి ఈ సారి నంద్యాల ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా గౌరు ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకువస్తానని తనకు ఎంపీ సీటు ఇవ్వాలని బేరం పెట్టారని తెలుస్తోంది. వాడుకుని వదిలేయడంలో నిపుణుడైన చంద్రబాబు ఈ ఆఫర్ కు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది.
అయితే శివానందారెడ్డికి ఈ సారైనా ఎంపీ టికెట్ ఇస్తారనేది డౌటే. ఎమ్మెల్సీ సీటు లాగానే ఆశ చూపి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా అనేది తేలేందుకు ఇంకాస్త సమయం పడుతోంది.