ఆళ్లగడ్డ టీడీపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య పంచాయితీ మరింత ముదిరిన సంగతి తెలిసిందే. ఈ పంచాయితీ బాబు దగ్గరకు చేరింది. ఇద్దరి మధ్య రాజీకుదర్చాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.
తాజాగా అఖిల బాబుకు పెద్ద షాక్ ఇచ్చారు. సుబ్బారెడ్డితో చర్చలకు వెళ్లేదే లేదని తేల్చి చెప్తున్నారు అఖిలప్రియ. ఒకవేళ ముఖ్యమంత్రి ఏవీ సుబ్బారెడ్డికే మద్దతిస్తే మంత్రి పదవి వదులుకునేందుకు కూడా వెనుకాడకూడదన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు. అవసరమైతే పార్టీ మారేందుకైనా సిద్ధపడాలన్న వాదన ఈ అంతర్గత సమావేశంలో వ్యక్తమయినట్టు సమాచారం.
ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి మొదటి నుంచి కుడిభుజంగా నిలిచిన ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియకు అస్సలు పొసగడం లేదు. ఈ మధ్య ఏవీ సైకిల్ ర్యాలీపై రాళ్లదాడి జరగడంతో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు సర్దిచెప్పి రాజీ కుదిర్చేందుకు చంద్రబాబు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య పంచాయితీ రెండు సార్లు వాయిదా పడింది.
రెండుసార్లూ ఏవో కారణాలతో అమరావతికి రాని అఖిలప్రియ ఇవాళ కూడా డుమ్మాకొట్టాలన్న ఆలోచనలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఉదయం సన్నిహితులతో జరిగిన మీటింగ్ బట్టి చూస్తే.. బాబుతో అమీతుమీ తేల్చుకొనేందుకు ఆమె సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
కర్నూలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ట్రై చేస్తున్న పరిస్థితుల్లో, అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి గొడవ చంద్రబాబుకు చికాకులు తెప్పిస్తోంది. ఇద్దరి మధ్య బాబు చేస్తున్న ప్రయత్నాల విషయంలో అఖిల పంతానికి పోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. త్వరలోనే అఖిల మంత్రిన పదవికి రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారనే చెప్పవచ్చు.