తెలంగాణాలో ముందస్తు ఎన్నికల సంకేతాలతో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమనే సంకేతాలు పంపింది.
మంగళవారం గాంధీ భవన్లో సమావేశమైన కాంగ్రెస్ ముఖ్య నేతలు.. తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అలాగే ముందస్తు ఎన్నికలొస్తే ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చించారు. దీనిలో భాగంగానే టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం పిలుపు మేరకు హుటా హుటిన ఢిల్లీ వెల్లారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉత్తమ్ కలుస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జరగనున్న భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నట్టు సమాచారం. ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఖాయమైతే.. ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారట.
అలాగే ఉత్తమ్కు దిశా నిర్దేశం కూడా చేస్తారట. ఎన్నికలకు సంబంధించి ప్రచార కమిటీలు, మేనిఫెస్టోతో పాటూ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన వ్యవహారాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందట. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్, టీపీసీసీకి యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.