రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందనేది మరో సారి రుజువైంది. జాతీయ స్థాయి మీడియా సంస్థల సర్వేలలో జగన్ పార్టీ దూకుడు కనిపిస్తోంది. ఇప్పటికే ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీల సర్వేలు వైసీపీదే అధికారం అని తేల్చి చెప్పాయి. ఇప్పుడు మరో జాతీయ సర్వే టైమ్స్ నౌ కూడా జగన్కే జైకొట్టింది.
లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాలకు గాను 23 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. పోల్ ట్రాకర్ పేరుతో వీఎంఆర్ సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ వివరాలను ఆ ఛానల్ ప్రకటించింది. అధికార టీడీపీ దారుణంగా దెబ్బతిని 2 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. వైసీపీ, టీడీపీల ఓట్ల శాతం కూడా భారీగా ఉండనున్నట్టు తేల్చింది. వైసీపీ ఏకంగా 49.5% ఓట్లు సాధించగా టీడీపీ 36% ఓట్లు మాత్రమే వస్తాయని.. కాంగ్రెస్ 2.5%, బీజేపీ 4.8% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది.
ఇక తెలంగాణాలో కారు స్పీడు తగ్గుతుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే చెప్పింది. 16 స్థానాలు కైవసం చేసుకోబోతున్నామనే ధీమాతో ఉన్న టీఆర్ఎస్ 10 సీట్లలో మాత్రమే గెలుస్తుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పుంజుకొని 5 స్థానాల్లో నెగ్గే అవకాశం ఉన్నట్టు తేల్చింది. బీజేపీ ఒక స్థానం, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని అంచనా వేసింది.
2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైఎస్సార్సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. ఇక సర్వేలో జనసేన పార్టీ కనుచూపు మేరలో కూడా కనిపించడంలేదు.