జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ అంశంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు బాధించాయని వైసీపీనేత అంబటి రాంబాబు అన్నారు. కాపు రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకంగా కాదని మా పరిధిలో లేదని మాత్రమే చెప్పారన్నారు. జగన్ వ్యాఖ్యలను వక్రీకరించి కొన్ని శక్తులు…కుట్రపన్ని రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కాపు రిజర్వేషన్లకు వైసీపీ వ్యతిరేకం కాదని, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఒక్కసారి హామీ ఇస్తే… వెనక్కి తీసుకునే తత్వం జగన్ ది కాదని అన్నారు.కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. 6 నెలల్లో బీసీ కమిషన్ వేసి కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, మరి ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఈ రోజు వరకు కాపు రిజర్వేషన్ల అంశం ఎందుకు పెండింగ్లో ఉందన్నారు. ముద్రగడ ఉద్యమం తర్వాతే చంద్రబాబుకు కాపులు గుర్తొచ్చారని మండిపడ్డారు.
ముద్రగడ ఆమరణ దీక్షకు దిగితే… తలుపులు పగలగొట్టి, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు లాక్కెళ్లారని… ఆ సమయంలో ముద్రగడకు అండగా ఉన్నది జగనేనని గుర్తుచేశారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పారు.
కాపు రిజర్వేషన్లపై బీసీ కమిషన్ వేసి నివేదిక పరిశీలించకుండా హడావిడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు.. ఈ అంశంపై కేవలం ముగ్గురు సభ్యులు ఇచ్చిన రిపోర్టునే కేంద్రానికి పంపారన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులను కూడా కాపులకు కేటాయించలేకపోయారని అంబటి రాంబాబు ఆరోపించారు.