జగన్పై జరిగిన హత్యాయత్న ఘటనపై మరో సారి ఆ పార్టీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితోపాటు మాజీ ఎంపీల బృందం రామ్ నాథ్ కోవింద్ ను కలిసి జగన్ పై దాడి కేసును థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరారు. ఘటనకు సంబంధించి వైసీపీ నేతల అనుమానాలను రామ్ నాథ్ కోవింద్ కు వివరించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నానికి సూత్రధారుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. చంద్రబాబుతో పాటు ఏపీ డీజీపీ, టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, యరపతినేని, శివాజీ, విశాఖ ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కూడా ఈ కుట్రలో భాగస్వాములని ఆరోపించారు.
చంద్రబాబు ప్రమేయం లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించ వచ్చు కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి లేదా కోర్టు ఉత్తర్వులు ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే, హత్యాయత్నం వెనుక కుట్రదారులు బయటపడతారని అన్నారు.
చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపే సంస్థలతో విచారణ చెయ్యమని కోరేవారన్నారు. అలా చెయ్యకుండా నిందారోపణలు చేస్తున్నారంటే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన విన్నపం పై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర పతిని కలిసిన వైసీపీ నేతల బృందంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.