కాంగ్రెస్లో వైఎస్ షర్మిల పార్టీ విలీనం డైలీ ఎపిసోడ్లా సాగుతోంది. రోజుకో ట్విస్ట్తో అసలు షర్మిలను కాంగ్రెస్లోకి రాణిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇది నిజంగా ఆమెకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంలో కీలకపాత్ర కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్దే. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్న చక్రం తిప్పారు డీకే. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో మరోసారి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి పార్టీ విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు షర్మిల. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఏ ఆఫర్ కి ఓకే చెప్పాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటు తెలంగాణలో అటు ఏపీలోనూ షర్మిల సేవలను వినియోగించుకునేందుకు ఆయా రాష్ట్రాల నేతలు ఒప్పుకోవడం లేదు. ఇక ఏపీలో షర్మిల కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే అది జగన్నే ప్లస్ అవుతుందనే భావనలో ఉన్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఇదే విషయాన్ని అధిష్టానానికి సైతం చెప్పారట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయాన్ని చెప్పడంతో షర్మిల రాజకీయ భవిష్యత్పై స్పష్టత ఇవ్వకపోయినా విలీనానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కాకపోతే షర్మిల సేవలను కర్ణాటకలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. జాతీయ స్థాయిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ ఇవ్వనున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతుండటంతో ఎట్టకేలకు కాంగ్రెస్- వైఎస్ఆర్టీపీ విలీనానికి ముందడుగు పడినట్లు విశ్వసనీయ సమాచారం.
రెండు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. రాజకీయ పార్టీ స్ధాపించాక పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని భావించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అయినా వెనుకడుగు వేయలేదు షర్మిల. తెలంగాణలో 3వేల 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అయితే అది అంతగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధమయ్యారు.