మరణించిన వ్యక్తిని బ్రతికించడం అసాధ్యం. అది ప్రకృతి నియమం. కాని మనిషికి పుర్జన్మ ను ప్రసాదించాలని పరిశోధనలు కొనసాగతున్నాయి. మరణించిన వ్యక్తిని బ్రతికించలేము అని తెలిసినా శాస్త్రవేత్తల్లో ఉన్న చిన్న ఆశ మాత్రం పరిశోధనలను కొనసాగించేలా చేస్తోంది. దానికి మొదటి అడుగు పడింది.
చనిపోయిన మృతదేహాన్ని భద్రపరిచి వైద్యం చేసి బతికించి పునర్జన్మ ప్రసాదించగలిగితే?.. ఆదో అద్భుతం. పురాణ గాథలు, కథలు, ఊహలు, సినిమాలకు మాత్రమే పరిమితమైన పునర్జన్మ భావన త్వరలోనే వాస్తవరూపం దాల్చనున్నదని చైనా శాస్త్రవేత్తలు నమ్మకంగా చెప్తున్నారు.
చైనా శాస్త్రవేత్తలు తొలిసారి ఓ మహిళ మృతదేహాన్ని క్రయోనిక్స్ విధానంలో గడ్డకట్టించారు. వ్యక్తి గుండెకొట్టుకోవడం ఆగిపోయిన సెకన్ల గడువులో రసాయనాలతో శరీరాన్ని గడ్డకట్టించడమే క్రయోనిక్స్ అంటారు. ఈ విధానంలో మృతదేహం ఏండ్ల తరబడి ఉన్నా పాడైపోదని అంటున్నారు.
క్యాన్సర్తో మరణించిన జెన్ వెన్లియాన్ (49) అనే మహిళ మృతదేహాన్ని జినాన్ లోని యిన్ఫెంగ్ బయలాజికల్ గ్రూప్ ల్యాబ్లో క్రయోనిక్స్ విధానంలో భద్రపరిచేందుకు 2000 లీటర్ల ద్రవరూప నైట్రోజన్ ఉపయోగించారు. భవిష్యత్లో ఆమెకు పునర్జన్మ ప్రసాదిస్తామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చైనాలోని యిన్ఫెంగ్ బయలాజికల్ గ్రూప్, షండాంగ్ వర్సిటీ, అమెరికా ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ సభ్యుల బృందం ఈ పరిశోధన చేపట్టింది. గుండె కొట్టుకోవడం ఆగిపోగానే మరణ ప్రక్రియ పూర్తి కాదని, శరీరంలోని కణజాలాలు, కండరాలు, అవయవాలన్నీ పూర్తి అచేతనంగా మారడానికి కొంత టైమ్ పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్రయేనిక్స్ విధానంలో జెన్ వెన్లియాన్ మరణ ప్రక్రియను వాయిదా వేశామన్నారు.
క్రయోనిక్స్ పద్ధతిలో మృతదేహాన్ని భద్రపరిచినా, ఆమెకు పునర్జన్మ ఎలా ప్రసాదిస్తారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నిజానికి వారి వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదు. భవిష్యత్ అవసరాల కోసమే ఆమె శరీరాన్ని భద్రపరిచామని చెప్తున్నారు.
ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆగిపోయిన గుండెను తిరిగి పనిచేయించలేమని.. కానీ భవిష్యత్లో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయగలుగుతామని పేర్కొన్నారు. అప్పుడు జెన్ వెన్లియాన్కు పునర్జన్మ ప్రసాదిస్తామని వివరించారు.