ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో కోహ్లి ఎలా బ్యాటింగ్ చేస్తాడనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. 2014లో ఇంగ్లాండ్ గడ్డ మీద 10 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 133 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటి కోహ్లీకీ, ఇప్పటి కోహ్లీకీ చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో అలవోకగా పరుగు వరద పారించాడు.
దీంతో కోహ్లిని కట్టడి చేయడం కోసం ఇంగ్లాండ్ భారీ ప్రణాళికలతో బరిలో దిగుతోంది. అండర్సన్ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించనున్న ఇంగ్లిష్ జట్టు.. అతడికి తోడుగా బ్రాడ్ కట్టుదిట్టంగా బంతులేయాలని ఆశిస్తోంది. మరోవైపు ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటిన అదిల్ రషీద్ను కూడా ఇంగ్లాండ్ టెస్టుల్లోకి ఎంపిక చేసింది. మూడో వన్డేలో రషీద్ అద్భుతమైన డెలివరీతో కోహ్లిని బౌల్డ్ చేశాడు. ఇలాంటి మ్యాజిక్ను టెస్టుల్లోనూ రిపీట్ చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఆశిస్తోంది.
కోహ్లి బ్యాటింగ్ సామర్థ్యం గురించి మాకు తెలుసు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో అతడొకడు. గత పర్యటనలో అతడు బాగా ఆడలేదు. కానీ అతడు ఏం చేయగలడో మాకు తెలుసు. అతడి ఆటను చూడటాన్ని ఎంతో మంది ఇంగ్లిష్ ఫ్యాన్స్ ఇష్టపడతారు. తనెంటో కోహ్లి ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతణ్ని కట్టడి చేయడం మాకెంతో ముఖ్యం. అతడ కోసం భారీ ప్రణాళికలు రూపొందించాం’’ అని జోయ్ రూట్ చెప్పుకొచ్చాడు.