ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ సొంత మైదానంలో కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ బౌలర్లు రెచ్చిపోవడంతో కింగ్స్ పంజాబ్ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా కింగ్స్ పంజాబ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఎదురైన ఓటమికి సన్రైజర్స్ ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సన్రైజర్స్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ప్టెన్ కేన్ విలియమ్సన్ (0), ఓపెనర్ శిఖర్ ధావన్ (11), సాహా (6) వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. మనీశ్ పాండే (54: 51 బంతుల్లో 3×4, 1×6), షకీబ్ అల్ హసన్ (28: 29 బంతుల్లో 3×4), యూసఫ్ పఠాన్ (21 నాటౌట్: 19 బంతుల్లో 1×4, 1×6) నిలకడగా ఆడటంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (32: 26 బంతుల్లో 4×4, 1×6) , క్రిస్గేల్ (23 నాటౌట్: 21 బంతుల్లో 1×4, 2×6) నిలకడగా ఆడి జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమవడంతో.. పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సన్రైజర్స్ చెలరేగిపోయింది. కింగ్స్ పంజాబ్కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం పైచేయి సాధించింది. ప్రధానంగా సన్రైజర్స్ రషీద్ ఖాన్, షకిబుల్ హసన్లు అద్భుతమైన స్పెల్తో కింగ్స్కు చుక్కలు చూపించారు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధిస్తే, షకీబుల్ రెండు వికెట్లతో మెరిశాడు. వీరికి జతగా సందీప్ శర్మ, బాసిల్ థంపిలు చెరో రెండు వికెట్లు తీశారు. కింగ్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(32), గేల్(23) మిగతా బ్యాట్స్మెన్ కనీసం పోరాటం చేయకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.