దక్షిణాఫ్రికాపర్యటనలో టెస్ట్సిరీస్ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ గెలుపే లక్ష్యంగా సిద్దమవుతోంది. డర్బన్ వేదికగా గురువారం తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు నెట్స్లో మంగళవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇప్పటికే ముగిసిన మూడు టెస్టుల సిరీస్ని 1-2తో చేజార్చుకున్న కోహ్లిసేన.. కనీసం వన్డే సిరీస్నైనా చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాకతో.. జట్టు వాతావరణం సరదాగా మారిపోయింది. వన్డేల కోసం ధోనీతో పాటు కేదార్ జాదవ్, శ్రేయాస్ అయ్యర్, చాహల్ ఇటీవలే భారత జట్టుతో చేరారు. అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు ప్రధాన కోచ్ రవిశాస్త్రి వీరితో ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయించారు.
ఇప్పటికే టెస్టు జట్టులో ఉండి ఘోరంగా విఫలమైన.. శిఖర్ ధావన్ వన్డే సిరీస్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా రహానె స్థానంలో తొలి రెండు టెస్టుల్లో అవకాశం దక్కించుకున్న రోహిత్ శర్మ.. విదేశీ గడ్డపై పేలవ రికార్డుని కొనసాగించి విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో తనకి అచ్చొచ్చిన వన్డేల్లో రోహిత్ ఏ మేరకు బ్యాట్ ఝళిపిస్తాడో చూడాలి. మొత్తం ఆరు వన్డేలని దక్షిణాఫ్రికాతో భారత్ ఆడనుంది.