ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. దక్షిణాఫ్రికా గడ్డ మీద జరిగిన టెస్టు సిరీస్లో మిగతా బ్యాట్స్మెన్ నుంచి పెద్దగా సహకారం లభించకున్నా.. టీమిండియా కెప్టెన్ మాత్రం పరుగుల వరద పారించాడు. ఆ టూర్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.
అయితే ఇంగ్లాండ్ గడ్డ మీద మాత్రం కోహ్లికి పేలవ రికార్డ్ ఉంది. 2014 పర్యటనలో కోహ్లి ఐదు టెస్టుల్లో కలిపి 13.40 యావరేజ్తో 134 రన్స్ మాత్రమే చేయలిగాడు. వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0,7, 6, 20 చొప్పున మాత్రమే అతడు పరుగులు రాబట్టాడు.
మిగతా అన్ని దేశాల్లో కోహ్లికి చక్కటి రికార్డ్ ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ గడ్డ మీద పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్లో పర్యటించనున్న టీమిండియా ఇంగ్లిష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని తహతహలాడుతోంది. ఈ టూర్లో కోహ్లి రాణిస్తే.. విమర్శకుల నోళ్లు మూయించడంతోపాటు భారత్ ఇంగ్లండ్ గడ్డ మీద సిరీస్ గెలుస్తుంది.
జులైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుండగా, 2019లో వన్డే వరల్డ్ కప్ ఇంగ్లండ్ వేదికగా జరగనుంది. దీంతో ఇంగ్లండ్ లో టీమిండియా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ ప్లేయర్లు కోహ్లీకి ఇంగ్లండ్ లోని కౌంటీల్లో ముందుగానే ఆడాలని సూచించారు. అలా ఆడడం వల్ల ఇంగ్లండ్ పిచ్ లపై అవగాహన ఏర్పడుతుందని, తద్వారా ఇంగ్లండ్ పర్యటన, వరల్డ్ కప్ లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలుగుతుందని వారు సూచించారు.
సీనియర్ల సూచలన నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ ముగియగానే కోహ్లీనీ బీసీసీఐ ముందుగా ఇంగ్లండ్ పంపనుంది. దీంతో జూన్ 14న బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కు కోహ్లీ దూరం కానున్నాడు. ఇంగ్లండ్ లో కోహ్లీ సర్రే జట్టు తరపున కౌంటీల్లో ఆడనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీమిండియా టెస్టు క్రికెటర్ ఛటేశ్వర పుజారా కూడా ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్ షైర్ కు ప్రాతినిధ్యం వహించనున్నాడు