తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. జయలలిత అత్యంత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్. వీరిద్దరికి ఎలా పరిచతం ఏర్పడింది అనేది చాలా ఆసక్తికరమైనదే.. వాస్తవానికి శశికళ ఓ సాధారణ గృహిణి. అయితే ఆమెకు సినిమాలంటే పిచ్చి. సినిమాల్లో నటించాలని కలలు కనేవారు. అయితే శశికళ భర్త ఆర్.నటరాజన్ తాత్కాలిక ప్రాతిపదికన తమిళనాడు ప్రభుత్వంలో ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా పనిచేసేవారు.
అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్కి సన్నిహితులైన కడలూరు జిల్లా కలెక్టర్ వీఎస్ చంద్రశేఖర్కు నటరాజన్ మిత్రుడు. నటరాజన్ తన మిత్రుడు చంద్రశేఖర్కు విషయం చెప్పి శశికళను జయకు పరిచయం చేయించారు. ఆ విధంగా 1989లో తొలిసారి జయ, శశికళ కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటూ వచ్చారు. తొలి రోజుల్లో జయ, శశికళ ఒకే విధమైన దుస్తులు, నగలు ధరిస్తుండేవారు. పోయ్సగార్డెనలోని జయ ఇంట్లో పనిచేసే పని మనుషులను కుదిర్చింది శశికళే.
తన సొంత గ్రామమైన మన్నార్గుడి నుంచి వారిని తెప్పించి, పనిలో పెట్టించింది. దానివల్ల జయలలిత ఇంట్లోని పనిమనుషులు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది అందరూ శశికళ చెప్పుచేతల్లోనే ఉండేవారని అంటారు. తమిళ రాజకీయ వర్గాలు వీరిని ‘మన్నార్గుడి మాఫియా’ అని పిలిచేవారు. శశికళ ద్వారా తన ఇంట్లో చేరిన మన్నార్ గుడి మాఫియా తనకు తెలియకుండా తనను మోసం చేసే పనికి పూనుకున్నారని జయలలిత ఆగ్రహం చెందారు. అదే సమయంలో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు విశేషంగా కొద్దికాలంలో పెద్ద యెత్తను సంపాదించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో 2012లో శశికళను, ఆమె బంధు మిత్రులను తన నివాసమైన పోయెస్ గార్డెన్ నుంచి జయ గెంటేశారు. పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. అయితే మూడు నెలల తర్వాత కరుణించిన జయ, తిరిగి శశికళను తన నివాసానికి రప్పించుకున్నారు. ఆ సమయంలో జయే స్వయంగా హారతినిచ్చి శశికళను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు పోయెస్ గార్డెన వర్గాలు చెబుతాయి.
Related