కరోనా వైరస్ ప్రతాపం కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటే కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది.. తాజాగా బర్డ్ఫ్లూ కోడి కూరను తిననివ్వకుండా చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు, బాతులు బర్డ్ ఫ్లూ బారిన పడి మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చికెన్, కోడిగుడ్లు తినకూడదనే ప్రచారం సాగుతోంది. బర్డ్ ఫ్లూ విజృంభణ కారణంగా హర్యానాలోని జింద్ జిల్లా నుంచి ఢిల్లీకి కోళ్ల తరలింపుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఢిల్లీలో కిలో కోడి మాంసం ఖరీదు రూ.15కు పడిపోవడం గమనార్హం. మరోపక్క చికెన్ కానీ, గుడ్లు కాని తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నా, దాని పేరు ఎత్తితేనే భయపడే పరిస్థితిలో జనాలు ఉన్నారు.
దాని ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడడంతో పౌల్ట్రీ వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. జింద్ జిల్లా నుంచి రోజుకి సుమారు నాలుగు లక్షల కోళ్లను విక్రయానికి తరలిస్తుంటారు. వాటి ధర ఒక్కసారిగా పడిపోవడంతో కోళ్ల వ్యాపారులు ప్రతిరోజూ సుమారు కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. జింద్ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి పేరుంది.
ఆ జిల్లాలో 500కు పైగా పౌల్ట్రీ ఫారాలు, 80కి పైగా హ్యాచరీలు ఉంటాయి. ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడిందో అక్కడ తీవ్ర స్థాయిలో నష్టాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, చికెన్ ను బాగా ఉడికించి తినడం వల్ల నష్టమేమీ ఉండదని వైద్యులు అంటున్నారు. పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వేలాది కాకులు, బాతులు మృతి చెందడంతో కోళ్ల బిజినెస్ కూడా దెబ్బతింటోంది.