సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రావణ్ అరెస్ట్ పైన రాజకీయంగా రచ్చ కొనసాగుతోంది. ఈ సమయంలో ఇదే అంశం పైన మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. రావణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ వస్తున్న ప్రచారాన్ని కొడాలి నాని పూర్తిగా ఖండించారు.
రావణ్ అరెస్ట్.. రాజకీయ విమర్శలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. రావణ్ పైన జనసేన కేసులు పెడుతోందని, ఎక్కడా టీడీపీ శ్రేణులు ముందుకు రావటం లేదని వ్యాఖ్యానించారు. రావణ్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తుంటారని విమర్శించారు. అందుకే ఆయన ఎప్పుడూ టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడరని పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియా అసత్య కథనాలతో రావణ్ను వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నాని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై రావణ్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ, తామెప్పుడూ ఆయనపై అణచివేత చర్యలకు పాల్పడలేదని కొడాలి నాని గుర్తు చేశారు.
తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గానీ, మా పార్టీ నేతలు గానీ రావణ్ విమర్శలను భరించామే తప్ప.. ఆయనపై అక్రమ కేసులు పెట్టలేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీలాగా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి దాడులకు ప్రయత్నించలేదని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని రావణ్ మాట్లాడటమే ప్రస్తుత ఆయన అరెస్టుకు అసలు కారణమని కొడాలి నాని విశ్లేషించారు. జనసేన పార్టీ కక్ష పూరితంగా వ్యవహరిస్తూ రావణ్పై వరుస కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పిందని ఆరోపించారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడికి రోజులు దగ్గరపడ్డాయని కొడాలి నాని హెచ్చరించారు. ప్రజల నోరు నొక్కే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
