విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. స్థానిక నేతల మధ్య గత కొంతకాలంగా రగులుతున్న అంతర్గత కుమ్ములాటలు చివరకు నడిరోడ్డుపై రసాభాసకు దారితీశాయి. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నాయకులు పరస్పరం బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగడం గమనార్హం. రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ బూతులు తిట్టుకున్నారు. ఈ పరిణామాన్ని చూసి స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమస్యను శాంతియుతంగా పరిష్కరించాల్సిన నాయకులు ఇలా నడిరోడ్డుపై కొట్టుకోవడంపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
