హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువతి భారతి ముఖి దుర్మరణం చెందింది. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నిందితుడు సంజుష్పై మాదాపూర్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై సంజుష్ మాట్లాడుతూ.. ఆగస్టు 16న జరిగిన ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి పారిపోలేదని స్పష్టం చేశారు. గాయపడిన భారతి ముఖికి వెంటనే సహాయం అందించేందుకు తన వాహనంలోనే ఆమెను బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లానని తెలిపారు. వైద్య సహాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, అయితే దురదృష్టవశాత్తూ ఆమె మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదం అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని అధికారులకు వివరించానని సంజుష్ తెలిపారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రమాదం సమయంలో తన పరిస్థితిని నిర్ధారించేందుకు బ్రీత్ అనలైజర్, యూరిన్, బ్లడ్ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. మూడు పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఫలితాలను కూడా దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
భారతి ముఖి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని సంజుష్ తెలిపారు. ఈ విషాద ఘటనపై తాను కూడా తీవ్రంగా చింతిస్తున్నానని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి ముందు, ప్రమాదం జరిగిన సమయంలో, అనంతరం చోటుచేసుకున్న ప్రతి పరిణామాన్ని సమగ్రంగా పరిశీలించాలని సంజుష్ విజ్ఞప్తి చేశారు. CCTV, వైద్య పరీక్షలు, ఇతర ఆధారాలతో వాస్తవాలను నిర్ధారించాలని కోరారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని సంజుష్ స్పష్టం చేశారు. సాధ్యమైనంత మేర బాధితురాలి కుటుంబానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దర్యాప్తులో అవసరమైన ప్రతి సమాచారాన్ని అందిస్తానని, జరిగిన పరిణామాలపై తన బాధ్యతను తప్పించుకోకుండా చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తానని పేర్కొన్నారు. మన చట్టవ్యవస్థ, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని, దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నానని సంజుష్ తెలిపారు.
