కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్-2018లో పేద ప్రజల ఆరోగ్యం కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు జైట్లీ. నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్ ద్వారా ఏటా ఒక్కో కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకంగా దీన్ని అభివర్ణించారు.
దీని ద్వారా దేశంలో సుమారు 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని విత్త మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం దీని ద్వారా 50 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆయన వెల్లడించారు. ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు. లక్షా 38 వేల కోట్ల నిధులను ఈ రంగానికి కేటాయించారు.
రూ.330 ప్రీమియం చెల్లింపుతో 10కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రకటించారు. దీని వల్ల 50కోట్ల మంది వినియోగదారులు లబ్దిపొందనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే
క్షయ వ్యాధిగ్రస్థుల కోసం జైట్లీ ప్రత్యేక ప్రయోజనాన్ని ప్రకటించారు. క్షయ రోగుల సంరక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు. టీబీ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుండటం, వీరిలో పేదలే ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఔషధాల ఖర్చుల కోసం నెల నెలా వీరికి రూ. 500 అందించనున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి విస్తరిస్తామని చెప్పారు.
జీవన ప్రమాణాల పెంపునకు పైలెట్ ప్రాజెక్టు కింద 116 జిల్లాలను ఎంపిక చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండేలా చూస్తామని, దేశవ్యాప్తంగా 24 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
