2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటన్నింటినీ తుంగలోకి తొక్కారు. బాబు ప్రభుత్వంలో ఇసుక కుంభకోనం, మరుగుదొడ్లు నుంచి ప్రాజెక్టుల వరకు ఎక్కడ చూసినా అవినీతిమయం చోటు చేసుకోవడంతో ప్రజల్లో బాబుపై ఆగ్రహం పెరిగిపోయింది. ఉద్యోగ భృతి, ఉద్యోగాల విషయంలో యువత ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఓ టీడీపీ కార్యకర్త చేసిన పనే అందుకు ఉదాహరణ.
వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ సీఎం తీరును యువత ఎక్కడిక్కడే ప్రశ్నిస్తున్నారు. ‘బాబు చేతిలో మోసపోయామన్నా…’ అంటూ జననేతకు గోడు చెప్పుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మురళీకృష్ణ అనే టీడీపీ కార్యకర్త జననేతను కలుసుకుని తన కష్టాన్ని చెప్పుకున్నాడు. ‘చంద్రబాబూ చూడు..’ అంటూ టీడీపీ సభ్యత్వ కార్డును చింపేసి, నేలకేసి కొట్టాడు.
నా పేరు మురళీకృష్ణ. మాది విజయవాడ. భీమవరంలోని మా బంధువుల జ్యూస్ షాప్లో కూలీగా పనిచేస్తున్నాను. టీడీపీని నమ్మి మోసపోయాను. జెండాలు కట్టడం దగ్గర్నుంచి అన్ని పనులూ చేశాను. చదువుకున్న నాకు ఏదో ఒక బతుకుదెరువు చూపిస్తామన్న టీడీపీ నాయకులు.. డబ్బులిస్తేనేగానీ ఉద్యోగం లేదని అంటున్నారు. మూడు లక్షలు ఇస్తే విజయవాడ కార్పొరేషన్లోనో, మంగళగిరి రిజిస్ట్రేషన్ ఆఫీసులోనో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తామని చెబుతున్నారు. బాబుపై ప్రజలు,నిరుద్యోగ యువత ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఈ ఒక్క సంఘటన తెలియజేస్తోంది.