వైఎస్ జగన్ చేపడుతున్న పాదయాత్రపై తన ప్రతాపం చూపించింది టీడీపీ ప్రభుత్వం. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ గోడును పాదయాత్రలో ఉన్న జగన్ తో మొర పెట్టుకున్నారు. జగన్పై ఉన్న అక్కసు ప్రభుత్వ ఉద్యోగులపై చూపించింది. జగన్ పాదయాత్ర కారణంగా తొమ్మిది మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. అదేంటి జగన్ను కలిస్తే ఉద్యోగాలు పోవడం ఏంటనుకుంటున్నారా..? మీరు విన్నది నిజం.
విశాఖపట్నంలో ఆదివారం ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో తొమ్మిది మంది టీచర్లు కలిశారు. ఇటీవల సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ తొమ్మిది మంది ఉపాధ్యాయులు వైఎస్ జగన్ను కలిసి వినతి పత్రం అందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో జగన్కు కృతజ్ఞతలు చెప్పేందుకు తొమ్మిది మంది ఉపాధ్యాయులు వెళ్లారు. అయితే వీరంతా పాదయాత్రలో పాల్గొని జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ కలిసి పనిచేస్తామని నినాదాలు చేసినట్టు పత్రికలలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన డీఈఓ…ఆ తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్ చేశారు. సస్పెండైన టీచర్లు పద్మనాభం, ఆనందపురం, భీమిలి, అనంతగిరి మండలాలకు చెందినవారని డీఈవో తెలిపారు.గవర్నమెంట్ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందునే వీరిపై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.