వైఎస్ జగన్ చేపట్టిన మహా సంకల్ప పాదయాత్ర మరి కొద్ది సేట్లో ముగియనుంది. ఇచ్చాపురంలో పాదయాత్రకు గుర్తుగా జాతీయ రహదారిని ఆనుకుని బహుదా నదికి సమీపంలో నిర్మించిన పాదయాత్ర పైలాన్ను ఆయన ఆవిష్కరిస్తారు. స్థూపాన్ని ఆవిష్కరించిన తర్వాత కాలినడకన పాత బస్టాండ్ వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. పైలాన్ వద్దకు వైఎస్ జగన్ రాకకోసం లక్షలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలు జగన్ నినాదాలతో మారుమోగుతున్నాయి.
2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో 134 నియోజకవర్గాల మీదుగా 231 మండలాలు, 2516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, ఎనిమిది కార్పొరేషన్ల మీదుగా ఈ యాత్ర సాగింది. ఈ క్రమంలో 124 సభలు, సమావేశాలు, 55 ఆత్మీయ సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.