అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ , టీడీపీ మధ్య నిత్యం రాజకీయ రచ్చ జరుగుతూనూ ఉంటుంది. ప్రభోదానంద స్వామి, జేసీ మధ్య జరిగిన రచ్చ సమయంలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3000 కి.మీ. పూర్తి చేసుకున్న పాదయాత్రకు సంఘీభావంగా ముచ్చుకోట రిజర్వాయర్కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్ర పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించి, ఆయనను అరెస్ట్ చేశారు.
పాదయాత్ర నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే ముచ్చుకోట గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఉదయాన్నే తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు దాకా పాదయాత్ర చేసేందుకు వచ్చిన పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వ్యవహారశైలిపై పెద్దారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.