నాటి కుటుంబ కథా చిత్ర నాయకుడు, నేడు ఏ పాత్రకైనా వన్నె తెచ్చేలా ఉన్న నటుడు జగపతిబాబు. అతడు కథనాయకుడిగా నటించిన చిత్రాలు ఇంటిల్లిపాదీని అలరించాయి. పక్కింటి ఆయనలాగ, తమ భర్తలాగ మహిళా లోకం ఊహించుకొని అతడి సినిమాలకు పోలొమని వెళ్లారు. ఇప్పుడు తన పంథా మార్చుకొని కొత్త పాత్రలతో తెలుగు సినీ ప్రజలకు దగ్గరవుతున్నాడు. అందులో భాగంగా ఎన్నో పాత్రలు చేస్తూ తన నటనను పదును పెట్టుకుంటున్నాడు. అతడి నటనకు మెచ్చిఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించింది. లెజెండ్ సినిమాలో తన యాక్షన్ పాత్రకు నంది అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
`తనను 30 ఏళ్లుగా భరిస్తున్న అభిమానులు, ఉత్తమ సహాయ నటుడిగా ఎంపిక చేసిన జ్యూరీకి థ్యాంక్స్. ఇది నాకు గొప్ప విషయం. ఎందుకంటే నా మొదటి సినిమా స్వప్న మూడు రోజులు ఆడింది. లెజెండ్ మూడు సంవత్సరాలు ఆడింది. హీరోగా చేసినప్పుడు మూడు రోజులు, విలన్గా చేసినప్పుడు మూడు సంవత్సరాలు సినిమా ఆడింది. అన్ని సంవత్సరాల్లోనూ నాకు అవార్డులు రావడం నాకు గర్వంగా ఉంది. నేను మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉంది. అవార్డు వచ్చిన ప్రతి సినమాలో నేను ఉన్నాను. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో సినిమాలకు అవార్డులు వచ్చాయి. ఇన్ని సినిమాల్లో ఉండడం దేవుడి కృపే. అందరికీ థ్యాంక్స్. ఇది అమరావతిలో జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఆంధ్ర, తెలంగాణ అని నేను నమ్మను. ఇది మీ అందరికీ తెలిసిందే. జై ఆంధ్ర, జై తెలంగాణ, జై కిసాన్ కాదు జై ఇన్సాన్` అని పేర్కొంటూ ముగించారు.
ఇలా జగపతి బాబు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆయన చాలా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కరెంట్ తీగ, లెజెండ్, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు తదితర సినిమాల్లో ఆయన నటించాడు. ఇంకా మరికొన్ని సినిమాల్లో అతడు నటిస్తున్నాడు. అవి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.