తిరుపతి జిల్లా వెంకటగిరి..చీరలకే కాదు వెంకటగరి పోలేరమ్మ జాతరకు ఫేమస్. ఇక రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోరు జరుగుతోంది. వైసీపీ నుండి మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు రామ్కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తలపడుతున్నారు.
గత ఎన్నికల్లో ఈ జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ గెలుపొందింది. గత ఎన్నికల్లో రామకృష్ణపై ఆనం రామనారాయణ రెడ్డి విజయం సాధించగా అనంతరం జరిగిర రాజకీయ పరిణామ క్రమంలో ఆనం టీడీపీలో చేరారు. అప్పటి నుండి ఇంఛార్జీగా పార్టీ కేడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు రామ్కుమార్.
ఇక టీడీపీ అభ్యర్థి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కలిసివస్తుందని భావిస్తున్నారు. తొలుత రామకృష్ణ కుమార్తె లక్ష్మీ ప్రియకు టికెట్ ఇవ్వగా ఆ తర్వాత రామకృష్ణ పేరునే ఖరారు చేసింది. అయితే వైసీపీ అభ్యర్థి జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తనను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రచార పర్వంలోనూ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు రామ్ కుమార్. దీంతో వెంకటగిరిలో ఈసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమేనా? లేదంటే టీడీపీ సానుభూతితో గట్టెక్కుతుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.