వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగులకుంట కేశవరెడ్డిపై తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ (TDP) కి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో స్థానికులు, పార్టీ శ్రేణులు ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
ఈ దాడి ఉదంతం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగులకుంట కేశవరెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. కేశవరెడ్డి తలకు అయిన గాయాల తీవ్రతను, ప్రస్తుతం వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను వైయస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని కేశవరెడ్డికి భరోసా ఇచ్చారు. పార్టీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది..అధైర్యపడొద్దు అంటూ ధైర్యం చెప్పారు. కేశవరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్థానిక పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు పెరిగిపోయాయని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని, ప్రతిపక్ష గొంతుకలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఈ తరహా గూండాగిరీకి పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాడిపత్రి దాడికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
