ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ పర్వం తుది అంకానికి చేరుకోగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. నియోజకవర్గాల వారీగా ఎవరికి వారే గెలుపు తమదంటే తమదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఉండి నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే కూటమి తరపునా ఎంపీ రఘురామ రాజు పోటీ చేస్తుండగా వైసీపీ తరపున పెనుమత్స వెంకటలక్ష్మి నరసింహారాజు బరిలో ఉన్నారు. ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కాదని రఘురామకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇదే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గెలుపులో క్లిష్టంగా మారింది.
తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. 2009,2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివకు 2019లో టీడీపీ నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వగా వైసీపీ తరపున పోటీ చేసిన ఆర్ఆర్ఆర్ గెలుపొందారు. ఇక ఈసారి ఉండి టికెట్ను ఆశీంచారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు,శివ. కానీ వీరిద్దరిని పక్కన పెట్టి రఘురామకు టికెట్ దక్కడంతో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. కలవపూడి శివ అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉండగా ఇది రఘురామ గెలుపుపై ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.
ఇక వైసీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలనే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రఘురామకు ఈ సారి భంగపాటు తప్పడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.