దేశంలో వడ్డీ రేట్లు పెరిగిపోవడానికి పారిశ్రామిక వేత్తలే కారణమని ఆర్ బి ఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పారిశ్రామిక వేత్తలు దాన్ని చెల్లించేందుకు మాత్రం ముందుకు రావడం లేదని, దీంతో బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అమలు చేస్తూ ఇచ్చిన అప్పులో కొంతైనా వసూలు చేసుకుంటోందని ఆయన అన్నారు.
మీరు తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించండి. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా మధ్య తరగతి ప్రజలు చేసుకునే పొదుపుపైనా, నిరుపేదల జీవితాలపైనా దీనీ ప్రభావం ఉంటోందని ఆయన అన్నారు. మరికొన్ని రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటున్న రాజన్ చేసిన ఈ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను ఆలోచనలో పడేశాయి. ఈ వ్యాఖ్యలు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో అని ఆరా తీస్తున్నాయి.
బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న బడా పారిశ్రామిక వేత్తలకు రాజకీయ నాయకులు అండ ఉంటుందని, ముఖ్యంగా పాలకపక్షం సహాయ, సహకారాలు ఉంటాయని అంటున్నారు. వివాదాస్పదంగా మారిన గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటున్న రాజన్ ఈ వ్యాఖ్యలు చేయడం పాలక పక్షానికి చురకలు అంటించేందుకే అని అంటున్నారు.
ఇకపోతే గవర్నర్ గా రాజన్ తప్పుకున్న తర్వాత ఆ పదవిలోకి ఎవరిని తీసుకోవాలో కేంద్రం కసరత్తు ప్రారంభించింది. జూలై నెలాఖరు నాటికి ఆ పదవికి ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ రేసులో ఎస్ బి ఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఆర్ బి ఐ డిప్యూటీ మాజీ గవర్నర్ సుభిర్ గోకర్ణ్, ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.