అది 21 ఏళ్ల కిందట.. తన పాటలతో ప్రజలను చైతన్యం చేస్తున్న గాయకుడు.. ఇంతలో తుపాకీ కాల్పులు.. గుండెకు చేరువగా చేరిన బుల్లెట్ అయినా బతికాడు.. తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో గొంతై ఉన్న వ్యక్తి ప్రజా గాయకుడు గద్దర్. ఆయనపై కాల్పులు జరిపి 21 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కరీంనగర్లో తెలంగాణ సాంస్కృతిక సైన్యం ఆధ్వర్యంలో ‘పాటపై తూట’… ‘పాటకు పునర్జన్మ’ అనే కార్యక్రమం న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గద్దర్ నాటి కాల్పుల ఘటనను గుర్తుచేసుకుని ఆవేదనకు గురయ్యారు.
నక్సల్బరీ ఉద్యమంపై పట్టు విడుపుగా ఉన్న ప్రభుత్వం జై తెలంగాణ అని నినదించినందుకు.. తనపై తూటాలు పేల్చిందని, తనపై దాడి చేసిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను తుపాకీ తూటాతో కాల్చివేస్తే ప్రజలు తమ దీవెనలతో పునర్జన్మనిచ్చారని గద్దెర్ గద్గద స్వరంతో చెప్పారు.
ప్రజల విముక్తి కోసం పాటుపాడిన అనేక మందిని కాల్చివేశారని, అందులో తాను మొదటి వాడిని, చివరి వాడినికూడా కాదని చెప్పారు. తనపై దాడిచేసి కాల్పులు జరిపిన తర్వాత ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చినా నేటికి కనీసం విచారణ చేయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లలో చనిపోయిన వారి మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, ఉరిశిక్షను రద్దుచేయాలనే డిమాండ్లతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తాను క్రీయాశీలకంగా పాల్గొన్నందుకే తనపై కాల్పులు జరిపించారని విమర్శించారు. రాజకీయ చైతన్యం కోసం కల్చరల్ ఫెడలరిజం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.