తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియను ప్రారంభించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎపిలో 13 జిల్లాలున్నాయి. వాటి సంఖ్యను 23 చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై దృష్టి సారించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ఉత్తరాంధ్రలో ప్రస్తుతం మూడు జిల్లాలున్నాయి. వీటి సంఖ్యను ఐదుకు పెంచాలనుకుంటున్నారు. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. సర్కార్ జిల్లాల సంఖ్యను కూడా పెంచాలన్నది ఓ యోచన.
ఇక రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కూడా విభజించాలని, ఇది ఎలా అయితే బాగుంటుందో నివేదిక ఇవ్వాల్సిందిగా సిఎం అధికారులను అదేశించినట్లు సమాచారం. కొత్తగా జిల్లాలు పెరిగితే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవచ్చునని, ప్రత్యేక హోదా దక్కని ఈ సమయంలో నిధుల కోసం ఇదే మంచి మార్గమని సిఎం కొందరు మంత్రులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.