16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపునకు జోధ్పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు దోషులకు 20ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. జోధ్పూర్ సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో ఈ కేసుకు సంబంధించి జరిగిన తుది విచారణ అనంతరం జస్టిస్ మధుసూదన్ శర్మ ఆశారాం, మరో ముగ్గురు వ్యక్తులను దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లడించారు.
2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్పూర్లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడిచింది
మహిళలపై అత్యాచారానికి పాల్పడిన గుర్మీత్ రహీమ్ బాబాను గత ఆగస్టులో దోషిగా ప్రకటించిన తర్వాత హరియాణా, పంజాబ్లో హింస చెలరేగడంతో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కేసును జైల్లోనే విచారణ చేపట్టి, తీర్పు వెల్లడించారు. ఆశారాం అనుచరులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
సుదీర్ఘ విచారణ అనంతరం నేడు జోధ్పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడే సమయంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నాలుగు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అవసరమైతే అదనపు బలగాలను వినియోగించాలని ఆదేశించింది.