వైసీపీ అధినేత జగన్ హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక విషయాలపై దృష్టిసారించారు. ఇప్పటికే సిట్ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నిందుతుడి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడంతో అతనిపై అనుమానాలు బటపడుతున్నాయి.
సిట్ అధికారులు శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులకు షాక్ తగిలింది. మూడు బ్యాంకు ఖాతాలను నడుపుతున్న శ్రీనివాస్ ఖాతాలో వేల కొద్దీ డబ్బులు వచ్చి పడేవని, వాటిని వెంటనే విత్ డ్రా చేసే శ్రీనివాస్, వాటిని జల్సాలకు, అమ్మాయిలకు ఖర్చు చేసేవాడని, స్నేహితులకు పార్టీలు ఇచ్చేవాడని సిట్ గుర్తించింది.
అతని ఖాతాల్లో వేలకు వేలు ఎవరు వేశారు? ఎందుకు వేశారు? అన్న కోణంలో ఇప్పుడు దర్యాఫ్తు సాగుతోంది. శ్రీనివాసరావు రహస్యంగా బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాడా? అన్న అంశంపైనా ఆరా తీస్తున్నారు. నిందితుడు హత్యాయత్నాన్ని అంగీకరిస్తున్నా ఇతర అంశాలను మాత్రం వెల్లడించడం లేదు.
ఏడాదిలో శ్రీనివాసరావు పదివేల కాల్స్ మాట్లాడినట్లు కాల్ డేటా విశ్లేషణలో తేలింది. వీరిలో వందమందితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు గుర్తించారు. నిందితుడితోపాటు అతడి కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలను పోలీసులు తనిఖీలు చేశారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో రూ.80 వేలున్నట్లు గుర్తించారు. ఈ నగదు ఓ వడ్డీ వ్యాపారి ద్వారా ఖాతాలోకి జమైనట్టు గుర్తించారు.
మూడు నెలల క్రితం ఒక్క లావాదేవీతో రూ. 40 వేలు శ్రీనివాస్ ఎస్బీఐ ఖాతాలోకి రాగా, ఆపై రెండు రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు శ్రీనివాస్. మరోసారి రూ. 30 వేలు పడగా, దాన్ని ఒక్క రోజులో ‘ఉఫ్’మనిపించేశాడు. ఈ డబ్బును అమ్మాయిలతో పార్టీలకు, వారికి గిఫ్ట్ లు కొనిచ్చేందుకు, ఊరిలోని స్నేహితులకు మందు పార్టీ ఇచ్చేందుకు ఖర్చు చేశాడని సిట్ అధికార వర్గాలు వెల్లడించాయి.
శ్రీనివాస్ ఖాతాకు అతను పనిచేసే క్యాంటీన్ యజమాని హర్ష రూ. 40 వేలు బట్వాడా చేసినట్టు గుర్తించిన సిట్, ఈ విషయంలో హర్షను కూడా విచారించింది. విచారణలో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.