ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తి దాడి ఘటన కేసులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు హైకోర్టు నోటీసలు జారీచేసింది.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ సిట్ను ఏర్పాటు చేసింది. అయితే సిట్పై తమకు నమ్మకం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. జగన్ దాఖలుచేసిన పిటిషన్ ను ఈ రోజు విచారించిన కోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది.
విచారణ సమయంలో ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్షాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం న్ఐఏకి బదిలీ చేయటంపై తమ నిర్ణయాలను చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
దీనిలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఈ కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. 2019, జనవరి 4వ తేదీలోగా తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.
జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో నవంబర్ 25న దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్న జగన్ హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం జగన్ శ్రీకాకులం జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో ఉన్నారు.