- Advertisement -
మంత్రి హరీశ్రావు, ఎంపీ కవితతో మర్యాదపూర్వక భేటీ
నిజామాబాద్ జిల్లాలో యోగా గురువు బాబా రాందేవ్ మూడు రోజుల పాటు ఉండనున్నారు. పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో మంగళవారం (ఏప్రిల్ 10) నుంచి మూడు రోజులపాటు (ఏప్రిల్ 13) నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరం నిర్వహిస్తున్నారు. గుర్బాబాది రోడ్లో ఉండే తన శిష్యుడు పవన్కుమార్ కేడియా నివాసంలో బాబారాందేవ్ బస చేశారు. యోగా శిబిరం ప్రారంభోత్సవానికి నిజమాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత హాజరై శిబిరం ప్రారంభించారు.
పతంజలి యోగ పీఠం నిర్వహిస్తున్న ఉచిత యోగ చికిత్స, ధ్యాన శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి యోగాసనాలు చేశారు. శిబిరంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికాసోని, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంకిషన్రావు, రెడ్కో చైర్మన్ అలీం ఉన్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు, ఎంపీ కవితతో కలిసి రాందేవ్ బాబా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాను రైతు బిడ్డనని.. రైతులు చేసే పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని రాందేవ్ బాబా తెలిపారు. మంచి పని కోసం తాను ముందు వరుసలో ఉంటానని చెప్పిన బాబా.. పసుపు బోర్డు ఏర్పాటు పోరాటానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ కవిత తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశంలో పతంజలిదే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని తెలిపారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై రాందేవ్ ప్రశంసలు కురిపించారు. కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం చేస్తున్న పోరాటానికి తాను మద్దతిస్తానని రాందేవ్ బాబా ప్రకటించారు. పసుపు బోర్డును ఏర్పాటుకు ప్రధానితో మాట్లాడాలని రాందేవ్ బాబాకు కవిత విజ్ఞప్తి చేశారు. పతంజలి కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ను నిజామాబాద్లో నెలకొల్పాలని కోరారు. పతంజలి కంపెనీ చేపట్టబోయే ప్రతి పనికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని కవిత చెప్పారు.