వైసీపీ అధినేత జగన్ పై కత్తితో దాడి జరిగిన ఘటనను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని, దీనిపై నిష్పాక్షిక విచారణ జరగాలని, ఓ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని ఎవరు ఏ ఆలోచనతో ప్రేరేపించారో తేలాలని, తప్పుడు ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయడంతో టీడీపీ నెంబర్ వన్ అని, ఎయిర్ పోర్ట్ లో దాడి చేస్తే తమపైకి రాదని టీడీపీ అనుకున్నట్టుందని ఆరోపించారు.
ఈ ఘటనపై చంద్రన్న ఇన్విష్టిగేషన్తో లాభం లేదని బాబుపై సెటైర్లు వేశారు. గతంలో చాలా ముఖ్యమైన విషయాల్లో చంద్రన్న ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) ఎలా పనిచేసిందో చూశామంటూ జీవీఎల్ ఆక్షేపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీదా ఇదేతరహా దాడుల్ని టీడీపీ చేయించిందని ఆరోపించారు.
దాడి టీడీపీ కుట్ర అయి ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు వస్తున్న ప్రజల ఆదరణను చూసి తట్టుకోలేక … బయట దాడి చేసే ధైర్యంలేక, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుండే ఎయిర్పోర్ట్ని లక్ష్యంగా చేసుకుని వుంటారని జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు.