కాంగ్రెస్ పార్టీకీ మాయావతి అల్టిమేట్టం జారీ చేసింది. 2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు మాయావతి బయటనుంచిమద్దతు ఇచ్చింది. గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులపై నమోదైన కేసులను ఎత్తి వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. అలా చేయకుంటే మద్దతుపై పునరాలోచిస్తామని ప్రకటించారు.
బీజేపీ ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని… బీజేపీ మాదిరే కాంగ్రెస్ వ్యవహరించరాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని మాయావతి చెప్పారు. హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీలను ఒకే నాణేనికి రెండు వైపులుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
ఈ కేసులను ఎత్తివేయాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు బీఎస్పీ అల్టిమేటం విధించడం..కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడి రెండు వారాలు గడవక ముందే మాయావతి మద్దతు ఉపసంహరణపై హెచ్చరికలు చేయడం… అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.