ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎవరి చెప్పు చేతల్లో ఉందో అందరికీ తెలుసు. వారికి వ్యతిరేకంగా ఏ కథనం మీడియాలో వచ్చినా తట్టుకోలేరు! రాష్ట్రంలో వాస్తవ పరిస్థితినీ, రైతుల అవస్థలనీ, అప్పులు బాధల్ని, రాజధాని నిర్మాణ ప్రాంతంలో రైతుల ఆవేదననీ, బలవంతపు భూసేకరణల్ని, అయినవారికి కేటాయింపుల్ని, నిధుల దుర్వినియోగాన్ని… ఇలా వాస్తవాలకు అద్దం పట్టినట్టు ఎక్కడ ఏ చర్చా కార్యక్రమం జరిగినా వారు ఓర్చుకోలేరు!
అంతా పాజిటివ్ వార్తలే రావాలి! వారు చేస్తున్న పాలనే అద్భుతం అని అందరూ మైకులు పట్టుకుని మాట్లాడాలి. తమ కరుణా కటాక్ష వీక్షణాల వల్లే రాష్ట్రం నేడు పచ్చగా ఉందని భజన చేయాలి. ఒకవేళ అందుకు భిన్నంగా ఏదైనా రాసినా.. చర్చించినా.. ఏం జరుగుతుంది అనేదానికి సాక్ష్యం ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ ప్రముఖ జర్నలిస్టు ఆవేదనే! ఆయన చేపడుతున్న చర్చలు ఏలికలకు నచ్చలేదని… కక్ష కట్టి మరీ ఒక ఛానెల్ నుంచి ఆయన్ని తప్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, పత్రికా స్వేచ్ఛ అంటే ఇలా అర్థం చేసుకునే వారు నేడు మీడియా గురించి కామెంట్లు చేయడం విడ్డూరం! మీడియాకు మసాలా కావాలని కామెంట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఢిల్లీలో మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. నవ్వుతూనే మాట్లాడుతూ… మీడియాకి పాజిటివ్ విషయాలు ఎక్కువగా అవసరం ఉండదని అన్నారు. ఎక్కువగా మసాలా వార్తల కోసమే కోరుకుంటున్నాయని చంద్రబాబు అనడం విశేషం. ఆంధ్రాలోని మీడియా సంస్థల్లో సింహభాగం తెలుగుదేశం వారి అదుపాజ్ఞల్లో ఉంటున్నాయన్ని అందరికీ తెలిసిన విషయమే! కొన్ని ఛానెల్స్కు అయితే దేశం పెద్దల నుంచే నెలవారీ జీతాలు కూడా వెళ్తుంటాయన్న పుకార్లు కూడా ఉన్నాయి. మీడియాపై అంత పట్టు కోరుకుని… వారి చెప్పుచేతల్లో ఉంచుకునే చంద్రబాబు నాయుడు… మీడియా మసాలా కోరుకుంటోందని అనడం విడ్డూరంగా ఉంది. పోనీ, ఆయన దృష్టిలో మసాలా అంటే ఏంటో కూడా క్లారిటీగా మాట్లాడి ఉంటే బాగుంటుంది. పాలక పక్షానికి వ్యతిరేకంగా వచ్చిన కథనాలన్నీ ఆయన దృష్టిలో మసాలా స్టోరీలేమో మరి!