తెలంగాణ తెలుగుదేశం పార్టీ అవసాన దశలో ఉండగా ఇప్పుడు మరో కోలుకోలేని దెబ్బ పడే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తన నాయకత్వంలో తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న తూళ్ల దేవేందర్గౌడ్ ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానాలు పొందిన దేవేందర్గౌడ్ పార్టీ మారనున్నాడు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన దేవేందర్గౌడ్ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఉన్నాడు. చిన్న స్థాయి నుంచి ఎదిగి రాజ్యసభ దాకా అడుగుపెట్టాడు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీలో ఇమడలేక పోయాడు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం వైపు సానుకూలంగా ఉండడంతో టీడీపీకి రాజీనామా చేశాడు. 2008లో నవ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడాడు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో తన పార్టీని విలీనం చేశాడు. ఆ తర్వాత కొనసాగుతూ ఉన్నాడు. ఆ తర్వాత చిరంజీవితో పడలేక చివరికి మళ్లీ సొంతగూటికి చేరాడు. తనకు టీడీపీ తప్ప ఇంకేది దిక్కు లేదని తెలుసుకొని చివరకు చంద్రబాబు పక్కన చేరాడు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యాడు. రాజ్యసభకు దేవేందర్గౌడ్ ఎంపిక సొంత పార్టీ నాయకులు చాలా వ్యతిరేకించారు. కానీ బాబు వినలేదు.
2014 ఎన్నికల్లో తన కుమారుడి తూళ్ల వీరేందర్గౌడ్ను ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీకి దింపాడు. చేవెళ్ల లోక్సభ సభ్యుడిగా పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత తెలుగు దేశం యువత పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు టీడీపీకి కోలుకునే పరిస్థితి లేకపోవడం.. తన కుమారుడికి ఓ రాజకీయ పునాది వేయాలనే ఆలోచనతో దేవేందర్గౌడ్ ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే టీఆర్ఎస్లో చేరుద్దామంటే తన కుమారుడికి అవకాశం కల్పించలేమని తేల్చడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నాయకులతో దేవేందర్గౌడ్కు సత్సంబంధాలు ఉన్నాయి.
పూర్వ రంగారెడ్డి జిల్లాలో దేవేందర్గౌడ్ కుటుంబానికి మంచి పేరు ఉంది. అప్పుడు ఇప్పటి మంత్రి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులతో సత్సంబంధాలు ఉన్నాయి. పూర్వ రంగారెడ్డి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు ఆ పరిస్థితి మారడంతో దేవేందర్గౌడ్ తన కుమారుడు, అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమే.