భారత సాయుధ దళాల చేతికి త్వరలోనే అత్యాధునిక స్వదేశీ కార్బైన్ తుపాకులు అందనున్నాయి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 5.56×30ఎంఎం జాయింట్ వెంచర్ ప్రొటెక్టివ్ కార్బైన్ తుపాకులు (జేవీపీసీ) సైనిక సేవల్లో చేరేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 7న నిర్వహించిన తుది దశ పరీక్షలో అన్ని రకాల ప్రమాణాలను కచ్చితత్వంతో నిరూపించుకున్నట్లు అధికారులు తెలిపారు.
కార్బైన్ తుపాకుల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోంది భారత సైన్యం. గతంలో పశ్చిమాసియాకి చెందిన తుపాకులను కొనుగోలు చేసేందుకు ఎంపిక చేయగా.. తుది దశలో టెండర్ ఆగిపోయింది. ఈ క్రమంలో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన కార్బైన్ తుపాకులు అన్ని పరీక్షలను పూర్తి చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కార్బైన్ గన్స్ కోసం ఎదురుచూస్తోన్న సైన్యం కల నెరవేరనుంది.
ఈ తుపాకులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పరీక్షలను విభిన్న పరిస్థితుల్లో నిర్వహించారు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలో, శీతాకాలంలో అత్యంత ఎత్తులో ఈ పరీక్షలు చేపట్టారు. అన్ని పరీక్షల్లోనూ ఈ తుపాకులు కచ్చితమైన ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.