తెలంగాణా సీఎం కేసీఆర్ హుష్నాబాద్లో జరిగే బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అసెంబ్లీనీ రద్దుచేసిన వెంటనే పార్టీ అభ్యర్తులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో నవంబర్లోనే ఎన్నికలు జరిగి డిసెంబర్ లో ఫలితాలు వెలువడతాయని చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్నే లేపాయి.
ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా కేసీఆరే చెప్పేస్తారా? అంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వామపక్ష పార్టీలు ఎలక్సన్కు కమిషన్కు ఫిర్యాదు చేశారు. దుమారం రేపుతున్న వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పందించారు .
కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి వ్యాఖ్యానించినట్టు తాను మీడియాలో చూశానని… ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం కాకుండా ఇతరులు ప్రకటించడం తప్పని అన్నారు. అసెంబ్లీలో కాని, ఇతర సభలో కాని రాజకీయ నాయకులు ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని తెలిపారు.
వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని… అయితే, మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని రావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నుంచి నివేదిక వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రంలో అన్ని వసతులు సిద్ధంగా ఉంటే ఎన్నికలు నిర్వహించడానికి మాకెలాంటి ఇబ్బంది లేదన్నారు.