దాయాది దేశం మరోసారి తొక జాడించడానికి చేసిన ప్రయత్నాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టింది. పాక్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-16 విమానాలను భారత గగనతలంలోకి పంపించింది ఆ దేశం. అయితే వెంటనే స్పందించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్.. పాక్ విమానాలను తరిమి కొట్టింది. ఈ క్రమంలో ఓ ఎఫ్-16 విమానాన్ని ఐఏఎఫ్ కూల్చేసింది. నౌషేరా సెక్టార్లోని లామ్ లోయలో ఈ ఘటన జరిగింది. పాక్కు చెందిన ఎఫ్-16 విమానం కూలుతున్నట్లు అక్కడి వాళ్లు గమనించారు. ఆ వెంటనే ఓ పారాషూట్ కూడా కనిపించింది. పైలట్ చనిపోయాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
పాక్ విమానాలను భారత వైమానిక దశాలు తిప్పికొట్టాయి. తిరిగి వెళ్లేముందు పాక్ ఫైటర్ జెట్లు బాంబులు జారవిడిచాయి. భారత సైన్యానికి చెందిన పోస్టులపై బాంబులు వేసినట్లు భారత సైనికులు గుర్తించారు. కానీ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
కానీ పాకిస్థాన్ మాత్రం ఎప్పటిలాగే విరుద్ధమైన ప్రకటనలు చేసి తమ పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది. పాక్ ఎయిర్ఫోర్సే రెండు ఐఏఎఫ్ విమానాలను కూల్చేసిందని, ఓ ఇండియన్ పైలట్ను అరెస్ట్ కూడా చేశామని ఆ దేశ మేజర్ జనరల్ గఫూర్ చెప్పడం విశేషం.
భారత గగనతలంలోకి యుద్ధవిమానాలను దాయాది దేశం తరలించడంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ పూర్తి అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలో భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.
సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం.. యుద్ధవిమానాల కూల్చివేత నేపథ్యంలో పాకిస్థాన్ తమ దేశానికి చెందిన విమానాశ్రయాల కార్యకలాపాలను నిలిపివేసింది. లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్, సియాకోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.