భారత్ , చైనా మధ్య డోక్లాం సమస్య సద్దుమనిగిన తర్వాత మరో సంఘన చోటు చేసుకుంది. తాజాగా చైనాభూబాగంలో అక్రమంగా ప్రవేశించిన భారత్కు చెందిన డ్రోన్నుకూలిపోయిందని ఆదేశ మీడియా ప్రధానంగా ఆరోపించింది. తమపై నిఘా కోసం భారత్ ఓ డ్రోన్ ను ప్రయోగించిందని, అది తమ ఎయిర్ స్పేస్ లోకి వచ్చి కూలిందని చైనా మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.
ఈచర్యపై మేం తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం’ అని చైనా ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కొంబాట్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ ఝాంగ్ షుయిలిని ఉటంకిస్తూ జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్ పట్ల తాము వృత్తిపరమైన దృక్పథంతో వ్యవహరించి.. దాని గుర్తింపు వివరాలు సేకరించామని ఆయన తెలిపారు. అయితే, ఈ డ్రోన్ ఎప్పుడు చైనాలోకి ప్రవేశించింది.. దీనిని ఎక్కడ కూల్చేశారు అనే విషయాలు వెల్లడించలేదు.
చైనా, భూటాన్, సిక్కిం ట్రైజంక్షన్లో ఉన్న డోక్లాం కొండప్రాంతంలో సైనిక ప్రతిష్టంభన తలెత్తడంతో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ కొండప్రాంతంలో సైనికులు ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొనడంతో దాదాపు రెండు నెలలు పరిస్థితి తీవ్ర వివాదాన్ని రేపింది. అయితే డ్రోన్ ను చైనా దళాలే కూల్చేసి ఉండవచ్చని కూడా అనుమానాలు ఉన్నాయి. భారత్ నుంచి మాత్రం డ్రోన్ విషయమై ఇప్పటి వరకు ఎటువంటి స్పందనా రాలేదు.