ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోట్ల రద్దు మొదలుకొని అన్నీ కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. అనాదిగా వస్తున్న కరెన్సీ రూపురేఖలను మార్చేస్తున్నాడు. అంతర్జాతీయ కరెన్సీ మాదిరి మన దేశ నోట్లను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ విధంగా రూ.2 వేల నోట్లు, రూ.500 నోట్లు విభిన్నంగా కొత్తగా తీసుకొచ్చారు. కొత్త రంగులో డాలర్ల మాదిరి మన దేశ కరెన్సీ రూపొందించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రూ. పది నోట్లను కూడా మార్చేస్తున్నారు.
కొత్త నోట్లలో రూ.10 నోటు కూడా చేరింది. సరికొత్త రంగులో ఈ నోట్లను విడుదల చేయనున్నారు. చాక్లెట్ కలర్లో రూపొందించారు. మహాత్మాగాంధీ సిరీస్ కింద చాక్లెట్ బ్రౌన్ రంగుతో కొత్త 10 రూపాయల నోటును విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). శుక్రవారం (జనవరి-5) ఈ కొత్తనోటును విడుదల చేసింది. 100 కోట్ల విలువైన 10 రూపాయల నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
సోమవారం నుంచి డైరెక్టుగా ఈ కొత్తనోట్లు బ్యాంకుల్లో చలామణి అవుతాయని ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10 రూపాయల నోటు డిజైన్ను చివరిసారిగా 2005లో మార్చారు. నకిలీ నోట్ల బెడద నుంచి విముక్తి పొందేందుకు, నగదు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా చిన్న డినామినేషన్ నోట్లను రీడిజైన్ చేసి అందుబాటులోకి తెస్తున్నారు.