అన్ని పనులు టీడీపీ విజయవాడ కేంద్రంగానే చేస్తోంది. అలానే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులదీ.. అందరు విజయవాడ బేస్డ్ గానే రాజకీయాలు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం విజయవాడకు కంప్లీట్ గా షిఫ్టు అవ్వలేదు. జగన్ హైదరాబాద్ లోని తన నివాసం లోటస్ పాండ్ కేంద్రంగానే పార్టీని నడిపిస్తున్నారు. అయితే విజయవాడలో నెలరోజులుగా ఆ పార్టీ యాక్టివిటీ పెంచారు. త్వరలోనే అన్ని పార్టీలలాగే విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరపడానికి సిద్ధం అవుతున్నాడు.
అమరావతిలో పార్టీ కార్యకలాపాలు ముమ్మరం చేయాలని జగన్ నిర్ణయించారు. అందుకే శాశ్వత భవనం నిర్మించుకునే వరకూ విజయవాడలో తాత్కాలికంగానయినా నివాసం ఉండాలని జగన్ భావిస్తున్నాడట. కాపులతోపాటు, నగరంలో బలంగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య, యాదవ వర్గాలనూ సమన్వయం చేసుకుంటేనే బెజవాడలో ఉనికి చాటుకోగలమని గ్రహించిన జగన్, ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేను త్వరలో పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జగన్.
ఇక రాజధాని నగరాలైన గుంటూరు, విజయవాడలో పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించిన జగన్.. విజయవాడలోనే నివాసం ఉండాలని భావిస్తున్నడట. విజయవాడకు దూరంగా ఉండటం వల్ల టీడీపీకి లబ్ధి చేకూరుతోందని జగన్ గ్రహించారు. తాను రాజధానిలో ఉంటే అధికారపార్టీ కూడా జాగ్రత్తగా ఉంటుందని, వైసీపీ నేతలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారని ఆయన అంచనా వేస్తున్నారట. పార్టీ కార్యకలాపాల వేడి పెంచడం వల్ల కార్యకర్తల్లో కూడా ఉత్సాహం పెరుగుతుందని, తాను హైదరాబాద్లో ఉండి, ఆంధ్రలో పార్టీని బలోపేతం చేయడం కంటే లోకల్ గా ఉండడం మంచిదని జగన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.