జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్ బారాముల్లాలోని లదూరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ (జేఈఎం) ఆపరేషనల్ హెడ్ ఖలీద్ను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ముకశ్మీర్ బారాముల్లాలోని లదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి .
బారాముల్లా జిల్లాలోని లాదోరా ప్రాంతంలో ఉగ్రావాదులు నక్కి ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన ఉమ్మడి బలగాలు (జమ్ము కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ) తనిఖీలు చేపట్టాయి. అయితే భద్రతా బలగాల కదలికలను గుర్తించిన ఉగ్రమూకలు సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందాడు. మృతుడిని జైషే మహ్మద్కు చెందిన అబు ఖలీద్గా గుర్తించారు.
2016 అక్టోబర్లో బారాముల్లాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులపై దాడి చేసిన భద్రతా బలగాలకు ఖలీద్ గురించి తెలిసింది. అప్పటి నుంచి ఖలీద్ కోసం గాలిస్తున్నారు. ఈ రోజు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరపగా, ఉగ్రవాదులు ఎదురు తిరిగారు. తమ చేతిలో హతమైంది ఖలీదేనని భద్రతా బలగాలు ధ్రువీకరించాయి.